ఓ౦ విఘ్నేశ్వరాయ నమః ఓ౦ శ్రీలక్ష్మీరంగనాథాయ నమః ఓ౦
సరస్వతీదేవ్యై నమః
వేదము వర్ణించిన అలంకారప్రియ స్వరూపమైన
విష్ణువు,అవనిని మోయుచున్న ఆదిశేషుడిని
పాన్పుగా చేసికొని,లక్ష్మీదేవి సపర్యలు
చేయగా కానవచ్చు రూపం"శ్రీ
లక్ష్మీరంగనాథస్వామి" స్వరూపం.అట్టి
విశిష్టమూర్తి కోరి వెలసిన తర్తూరు
గ్రామం క్షేత్రంగా
విరాజిల్లుతున్నది,మరి ఆయన ఎలా వెలిశాడో
తెలుసుకుందామా !
కొన్ని తరముల క్రితం ఉలుపాల వంశంలో రాజారెడ్డి
అనే రైతు తర్తూరులో వుండేవారు.వాళ్ళది తారుట్ల
గోత్రం,రాజారెడ్డి మంచి వ్యవసాయదారుడు.నైజాం
(తెలంగాణా)లోని వనపర్తి సంస్థానములో పెబ్బేరు
సమీపంలో శ్రీరంగాపురం అనే గ్రామము కలదు.
ఆ శ్రీరంగాపురంలో పూర్వము రాజులు కట్టించిన
అతిపురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయము వుంది,ఆ
గ్రామములో రెడ్లకులమునకు చెందిన రంగమ్మ అనే
భక్తురాలు వుండెను.ఆమె రంగనాథస్వామికి యనలేని
భక్తురాలు,ఆ కాలములో రంగమ్మను తర్తూరులో
నివాసముంటున్న రాజారెడ్డికి ఇచ్చి వివాహం
చేసినారు,వారి కాపురం సజావుగా సాగుచుండెను.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడపడచులకు వడిబియ్యం
పెట్టే పద్దతివుంది,పూర్వము 5పళ్ళు బియ్యంతో
పాటు పసుపు,కుంకుమ,రవిక
గుడ్డలు,అద్దము,దువ్వెన,"చెక్కబొమ్మ",కుంకుమ
భరిణెలు మొ॥నవి వడిలో పెట్టెడివారు,ఆ ప్రకారమే
రంగమ్మగారు శ్రీరంగాపురానికి వెళ్ళి
వడిబియ్యం పెట్టుకొని తర్తూరుకు వచ్చుటకు
ప్రయానమైనది.పూర్వకాలములో బస్సు
ప్రయాణసౌకర్యములు లేవు అందువలన కొంత దూరం
గుఱపు బండ్లలోనూ,ఎద్దుల బండ్లలోనూ ప్రయాణం
చేసెడివారు,రంగమ్మగారికి వడిబియ్యం మూట
బరువెక్కుతూవుండసాగింది అయినా ఆమె
శ్రీరంగనాథస్వామిని మనసున తలచుకుంటూ ఎలాగో
తర్తూరు గ్రామంచేరింది,ఆడపడుచులు వడిబియ్యం
పెట్టుకొని వచ్చిన తర్వాత ద్వారలక్ష్మిని(గడప)
ను పూజించుట మన హిందూ సాంప్రదాయం,అలా రంగమ్మ
గడపను పూజిస్తూ కూలబడి పోయినది.అప్పటికి
వడిబియ్యం మూట ఇంకా బరువెక్కడంతో
వడిబియ్యంలోని చెక్కబొమ్మను తీసి
విసరివేసింది,ఆ బొమ్మ ఎద్దులూ పశువులూ వుండే
గాడిపాడులో పడిపోయినది.
తరువాత ఒక నాటి రాత్రి రంగమ్మగారి భర్త అయిన
రిజారెడ్డీగారికి శ్రీరంగాపురంలో వెలసిన
శ్రీరంగనాథస్వామి స్వప్నంలో కనిపించి నేను
శ్రీరంగనాథస్వామిని అని నన్ను నీ భార్య రంగమ్మ
గాడీలో(గాడిపాడులో) పడవేసింది,నా
చెక్కప్రతిమను(బొమ్మను)తీసి పూజిస్తూ సేవలు
చేస్తూ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ అష్టమి
నుండి చైత్ర బహుళ విదియ వరకు ఉత్సవములు జరిపి
తిరుణాల చేయుము అని చెప్పి
అద్రుశ్యుడయినాడు,కాని రాజారెడ్డి ఏమీ
పట్టించుకోలేదు.
కొన్ని రోజులు గడిచిన తరువాత రాజారెడ్డిగారి
ఇంట్లోని పశువులూ,ఎద్దులు మృతి చెందడం,ఇంట్లో
పిల్లలకు,పెద్దలకు అనారోగ్యములు సంభవించుట
జరిగినది.ఇలా యేదైనా అనుకోని సంఘటనలు జరిగితే
పూర్వము ఎరుకలసాని గద్దె
చెప్పించుకొనెడివారు.అలా రాజారెడ్డిగారు కూడా
ఎరుకలసానితో గద్దె చెప్పించుకొనెను,ఆమె పాట
పాడుతూ మీయింటిలో ఎద్దుల గాడి పాడులో
శ్రీలక్ష్మీరంగనాథస్వామి ఉన్నాడని,ఆయనను మీరు
పూజించి,ఉత్సవములు,తిరుణాల జరపవలసినది అని
అప్పుడే మీకు శుభములు కలుగుతాయని చెప్పెను.
శ్రీలక్ష్మీరంగనాథస్వామివారు
రాజారెడ్డిగారికి రెండవ సారి కూడా స్వప్నంలో
దర్శన మిచ్చి ఉత్సవములు జరపమని కోరెను.
అయినప్పట్టికి కూడా రాజారెడ్డి "స్వామీ మేము
మధుమాంసములు భుజించువారమనీ,సురపానీయములు
సేవించువారలమనీ ఈ ఉత్సవములు జరుపుటకు
పనికిరాము"అని చెప్పడంతో
శ్రీరంగనాథస్వామమివారు "మంచి భక్తిశ్రద్దలు
గల్గివున్నవారైతే సరి కులముతో పనిలేదని చెప్పి
అదృశ్యమయ్యాడు".అప్పటి నుండి కొన్ని వందల
సంవత్సరముల నుండి ఉత్సవములు జరుపుతూ తిరుణాల
జరుపుతున్నారు.
అందుకే ఆ వంశస్థులైన రాజారెడ్డి కులస్తులను
ఇప్పటికి కూడా పూజార్లు అని పిలుస్తారు,ఇంట్లో
వాళ్ళకు ఇప్పటికి కూడా రంగనాథస్వామి
పేరుకలిసేలా పేరు పేట్టుకొంటూ వుంటారు.స్వామి
మహిమలు చెప్పగలిగినవి కావు,ఆయన తనను
నమ్మినవారి కొంగు బంగారం చేస్తారు.
2000సం॥ వరకు గాడిపాడులొనే స్వామివారు
ఉండెన.అనేక మహిమలు గల స్వామికి భక్తుల సంఖ్య
పెరుగుతూవచ్చినది.
నేటికి కూడా ఆవడిబియ్యంలో వచ్చిన
శ్రీలక్ష్మీరంగనాథ స్వామి వారి చెక్కప్రతిమనే
గ్రామోత్సవమునకు,రథోత్సవమునకు మరియూ
పారువేటకు కూడా ఊరేగింపుగా తీసుకువెలతారు.
(సాధారణంగా ఇటువంటి ఉత్సవాలకు మూలమూర్తిని కాక
ఉత్సవమూర్తిని ఉపయోగిస్తారు).
శ్రీ లక్ష్మీరంగనాథస్వామి వారికి
ప్రతిసంవత్సరము జరుగు ఉత్సవములు:-
1) చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది :గ్రామోత్సవము.
2) బ్రహ్మోత్సవములు:
అ) చైత్రశుద్ధ అష్టమి: పూల చప్పారం.
ఆ)చైత్రశుద్ధ నవమి : సింహవాహన సేవ.
ఇ)చైత్రశుద్ధ దశమి : హంసవాహన సేవ.
ఈ)చైత్రశుద్ధ ఏకాదశి : శేషవాహన సేవ.
ఉ)చైత్రశుద్ధ ద్వాదశి : హనుమద్వాహన సేవ.
ఊ)చైత్రశుద్ధ త్రయోదశి : గరుడ వాహన సేవ.
ఋ)చైత్రశుద్ధ చతుర్ధశి : గజవాహన సేవ.
ౠ)చైత్రశుద్ధ పౌర్ణమి : రథోత్సవ సేవ.
ఎ)చైత్రబహుళ పాడ్యమి : అశ్వవాహన
సేవ,పారువేట.
ఏ)చైత్రబహుళ విదియ : తీర్థావళి,వసంతోత్సవము.
3) శ్రావణ మాసం కడపటిశనివారం: భక్తాదులు
గ్రామోత్సవము జరుపుదురు.